బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఈశ్వర్ చిత్రంతో అరంగేట్రం చేసిన ప్రభాస్.. బాహుబలి తర్వాత మళ్లీ తిరిగి చూసుకోలేదు. ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా పెరగడంతో అతడితో భారీ బడ్జెట్ చిత్రాలు తీసేందుకు నిర్మాతలు క్యూ కడుతున్నారు. పెద్ద మొత్తంలోనూ ఖర్చు పెట్టడానికి వెనకాడట్లేదు. అలా ప్రభాస్ భారీ బడ్జెట్ చిత్రాల్లో బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ‘ఆదిపురుష్’ ఒకటి.
రామాయణ మహాకావ్యాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్నాడు. బాలీవుడ్ నటి కృతిసనన్ సీత పాత్రలో అలరించనుంది. ఇక నటుడు సైఫ్ అలీఖాన్ లంకేశుడిగా కనిపిస్తున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని వీలైనంత త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
ఆదిపురుష్ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆదిపురుష్ బడ్జెట్ ఎంతో తెలుసా .. అక్షరాలా 400 కోట్ల రూపాయలు. దాదాపు 15 స్వదేశీ, అంతర్జాతీయ భాషల్లో..విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి 20,000 థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ప్రభాస్ ఇక పాన్ ఇండియా స్టార్ గానే కాదు పాన్ వరల్డ్ హీరోగా మారిపోతున్నాడు. డార్లింగ్ అభిమానులకు ఇంతకంటే తీపి కబురు మరేం ఉంటుంది.