దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్చరణ్ కాంబినేషన్ తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్ . ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. తొలి రోజే ఈ సినిమా చూసేందుకు ఫ్యాన్స్తో పాటు ప్రముఖులు సైతం థియేటర్లకు క్యూకట్టడం విశేషం. ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన కొందరు ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ‘బాహుబలి’ సినిమా నిర్మాత శోభు యార్లగడ్డ ఆర్ఆర్ఆర్ చిత్రంపై స్పందించారు.
‘ఇప్పటి నుంచి నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డ్స్’ అంటూ శోభు ట్వీట్ చేశారు. ఇప్పటివరకు రికార్డ్స్ అన్ని బాహుబలితో పోల్చారు కదా.. ఇకపై ఆర్ఆర్ఆర్ సినిమాతో పోల్చండి అని అర్థం వచ్చేలా ఆయన ట్వీట్ చేశారు. నాన్ ఎస్ఎస్ఆర్ రికార్డ్స్ అని కూడా మరో ట్వీట్ చేశారు.
రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి పాన్ ఇండియా రేంజ్లో ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. శోభు యార్లగడ్డ నిర్మించిన బాహుబలి రెండు భాగాలు అనేక రికార్డులు బద్ధలుకొట్టాయి. బాహుబలి 2 తర్వాత ఏ సినిమా విడుదలైనా .. ఆ చిత్రం నెలకొల్పిన రికార్డులను మాత్రం బ్రేక్ చేయలేదు. దాంతో స్టార్ హీరోల రికార్డులను సైతం ఆ సినిమాల దర్శక నిర్మాతలు ‘నాన్ బాహుబలి’ రికార్డులు అని పేర్కొనేవారు. బాహుబలి తర్వాత ఇండస్ట్రీ హిట్ అనే మాట పక్కకు పోయింది. దాని స్థానంలో నాన్ బాహుబలి రికార్డ్స్ అనే కొత్త పదం తెరపైకి వచ్చింది.
అసాధారణ వసూళ్లు సాధించిన సినిమాల రికార్డులను పోల్చడానికి ‘నాన్ బాహుబలి రికార్డ్స్’ అనే పదాన్ని వాడుతున్నారు. ఇప్పటికీ అదే ట్రెండ్ కొనసాగుతూ ఉంది. ఇప్పుడు మరోసారి జక్కన్ననే ఆ రికార్డ్స్ బద్దలు కొట్టనున్నాడు. బాహుబలిలో ప్రభాస్ ఒక్కడే అయితే.. ఈసారి రామ్ చరణ్, ఎన్టీఆర్ ఉండటం విశేషం. రికార్డ్స్ గ్యారంటీ అనే విషయం తొలి షో పడగానే అర్ధమయిపోయింది. అందుకే శోభు యార్లగడ్డ ట్వీట్ చేశారు.