ప్రస్తుతం ఓటీటీల యుగం నడుస్తోంది. కరోనాతో థియేటర్లు మూతపడటంతో.. జనం ఓటీటీ వైపు మళ్లారు. కొన్ని సినిమాలను నేరుగా ఓటీటీల్లోనే విడుదల చేస్తున్నారు. గతంలో చిన్న సినిమాలకు థియేటర్ల సమస్యలు ఉండేవి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు కేవలం కొంతమంది గుత్తాధిపత్యంలో ఉండటంతో చాలా మంచి సినిమాలు కనీసం విడుదలకు కూడా నోచుకొనేవి కావు. ఈ క్రమంలో అటువంటి చిన్న నిర్మాతలకు ఓటీటీలు స్వర్గధామంలా మారాయి. మంచి కంటెంట్.. ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకొనే కథను తెరకెక్కించే దర్శకులకు మంచి అవకాశాలు వస్తున్నాయి.
ఓటీటీ పుణ్యమా అని కొత్త దర్శకులు, కొత్త నటులు కూడా పరిచయం అవుతున్నారు. అయితే అశ్లీలత శ్రుతి మించుతోందని.. హింస కూడా ఎక్కువగా ఉంటుందని ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ ఓటీటీలకు ప్రేక్షకుల్లో మాత్రం విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక ఇప్పటికే ఆమేజాన్, నెట్ఫ్లిక్స్, హాట్ స్టార్, జీ5, సన్ నెక్స్ట్ వంటి యాప్స్కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. వీటికితోడు ఆహా యాప్కు మంచి క్రేజ్ వచ్చింది. తెలుగులో ఎన్నో వినూత్నమైన చిత్రాలను, వెబ్ సీరిస్లను, స్పెషల్ షోలను ఆహా రూపొందిస్తున్నది.
అయితే ఇప్పుడు ఓటీటీ మార్కెట్లోకి మరో ప్రతిష్ఠాత్మక సంస్థ ఎంట్రీ ఇవ్వబోతున్నది. సోనీ ఇప్పుడు ఓటీటీల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు టాక్. సోనీ లైవ్ పేరుతో దక్షిణాదిన ఓ కొత్త ప్లాట్ఫామ్ను సిద్ధం చేయబోతున్నారట. ఇందుకోసం ఆయా భాషల్లో ఆఫీసులు తెరిచి టీంలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. తమిళంలో ధనంజయన్ అనే మీడియా మ్యాన్ కమ్ ప్రొడ్యూసర్ను హెడ్ను చేయగా.. తెలుగులో ప్రముఖ నిర్మాత మధుర శ్రీధర్కు బాధ్యతలు అప్పగించింది.
Also Read
బీ టౌన్ పై తెలుగు అగ్ర హీరోల కన్ను..!