బాలనటుడిగా మంచి పేరు తెచ్చుకున్న తేజ సజ్జ తర్వాత చిన్న చిన్న పాత్రల్లో కనించాడు. జాంబిరెడ్డి చిత్రంతో మంచి విజయం అందుకున్నాడు. కరోనా విజృంభణతో షూటింగ్ లు ఆగిపోతున్నాయి. రిలీజ్ లు వాయిదా పడుతున్నాయి. తాజాగా కరోనా ప్రభావం ‘ఇష్క్– నాట్ ఎ లవ్ స్టోరీ’ మూవీపై పడింది. నిన్నటి నుంచి తెలంగాణ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించింది. సినీ ఇండస్ట్రీ ప్రతినిధులూ థియేటర్లను మూసేస్తున్నట్టు ప్రకటించారు.
ఈ నేపథ్యంలోనే సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు తేజ ప్రకటించారు. వాస్తవానికి శుక్రవారం (23వ తేదీ) నుంచి ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. సుప్రసిద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటైన మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై.. తేజ సజ్జా, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోహీరోయిన్లుగా యస్.యస్. రాజుని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆర్.బి.చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఇష్క్’.
ఈ సందర్భంగా హీరో తేజ మాట్లాడుతూ.. రెండు వారాలుగా కరోనా పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని, ఇలాంటి సమయంలో సినిమాను విడుదల చేస్తే బాగుండదని, నైతికంగా సరైన నిర్ణయం కాదని తేజ చెప్పుకొచ్చారు. త్వరలోనే కొత్త విడుదల తేదీతో అందరి ముందుకు వస్తామని చెప్పారు.