ఈ మద్య బయోపిక్ చిత్రాలు వరుసతగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే బయోపిక్ అంటే సామాన్య విషయం కాదు.. ఆయా పాత్రలకు తగ్గట్టుగా తీర్చి దిద్దినట్టు గా ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. ప్రముఖుల జీవిత కథల్లో నటించేటప్పుడు వారి హావభావాలు, ఊతపదాలు, నడత, నడక అన్నీ వారిని తలపించేలా ఉండాలి. స్వయంగా ఆ ప్రముఖులు మళ్లీ కళ్లముందు కనిపించేలా పూర్తి స్థాయిలో ఉండాలి. బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ నటిస్తున్న ‘తలైవి’ సినిమాలో ఎంజీఆర్ పాత్రని అరవింద్ స్వామి పోషిస్తోన్న విషయం తెలిసిందే.
ఎఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి అరవింద్ స్వామి ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ సినిమాలో ఆయన ఎంజీఆర్ పాత్రలో ప్రజలకు నమస్తే చెబుతున్నట్లు ఈ లుక్ ఉంది. మరో లుక్ లో ఆయన పిల్లలతో కలిసి కూర్చొని భోజనం చేస్తున్నారు. ఇక దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా దర్శకుడు ఏఎల్ విజయ్ ‘తలైవి’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జనవరి 17న ఎంజీఆర్ జయంతి సందర్భంగా ఈ ఏడాది విడుదల చేసిన అరవింద్ స్వామి లుక్కి విశేషమైన స్పందన లభించింది.
తలైవి సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. విష్ణు వర్దన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ నిర్మాతలుగా, హితేష్ తక్కర్, తిరుమల్ రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక తమిళనాడు రాజకీయాల్లో ఎంజీఆర్ మరణానంతరం జరిగిన పరిణామాల పర్యవసానంగా, ఆయన రాజకీయ వారసురాలిగా జయలలిత ఏఐఏడీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే.