ఏపీలో సినీ వివాదానికి తెరపడేటట్లు కనిపించడం లేదు. కొందరు సినీ తారలను ప్రభుత్వం టార్గెట్ చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్టార్ హీరోల సినిమా విడుదల సమయంలో టికెట్ల అంశాన్ని వివాదస్పదం చేస్తోందన్న వాదన టాలీవుడ్లో వినిపిస్తోంది. ఇటీవల వరుస పరిణామాలు అవుననే అంటున్నాయి. ఇటీవల భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ టైంలోనూ జగన్ సర్కార్ కక్ష పూరితంగా వ్యవహరించదని సగటు ప్రేక్షకులు సైతం గుసగుసలాడుతున్నారు. భీమ్లా నాయక్ సినిమా విడుదలకు ముందు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చింది.
అదనపు షోలకు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేసింది. సినీ రేట్ల విషయంలోనూ కఠినంగా వ్యవహరించింది. కావాలనే పవన్ కళ్యాణ్ను జగన్ ప్రభుత్వం టార్గెట్ చేసిందని సర్వత్రా విమర్శలు వినిపించాయి. రాజకీయంగా దెబ్బతిసేందుకే ఇలా చేస్తున్నారని జనసేన కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించినా సినిమా సక్సెస్ చేసుకున్నామంటున్నారు. ఈశుక్రవారం మరో స్టార్ హీరో సినిమా రాబోతోంది. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధేశ్యామ్ వస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
ఐతే ఈ మూవీకి కూడా టికెట్ ధరల గండం పొంచి ఉందన్న వాదన వినిపిస్తోంది. తెలుగురాష్ట్రాల్లో ప్రభాస్కు మంచి ఫాలోయింగ్ ఉంది. తెలంగాణలో ఎలాంటి సమస్య లేకపోయినా..ఏపీలో మాత్రం గండి పడే అవకాశం ఉందని ప్రభాస్ ఫ్యాన్స్ దిగులు పడుతున్నారు. భీమ్లా నాయక్ మూవీకి వచ్చిన పరిస్థితి తమ హీరో మూవీ రాకుండదంటున్నారు. ఇప్పటికే సీఎం జగన్తో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. భేటీ అయిన వారిలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఉన్నారు. మరి రాధేశ్యమ్ మూవీకి ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చినా కొత్త సినిమా ధరలు ఎలాంటి ఊపిరిని పోస్తాయో చూడాలి.