- సినిమా వివాదంపై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- బెదిరింపులు ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్య
దేశవ్యాప్తంగా పద్మావతి సినిమాపై చర్చ జరుగుతోంది. ఈ సినిమాపై బీజేపీ, కర్ణిసేనలాంటి నాయకులు పద్మావతి హీరోయిన్ దీపికా పదుకునే, దర్శకుడు సంజయ్లీలా బన్సాలీలను శిరచ్చేధం చేసిన ఇచ్చిన ప్రకటనలపై, బెదిరింపులు, హెచ్చరికలు తీవ్ర దుమారం రేపాయి. వీరి ప్రకటనలు, బెదిరింపులపై సినీ పరిశ్రమ ఫైర్ అయ్యింది. ఇలా అయితే సినిమాలు తీసుకోలేమని తేల్చి చెప్పారు. భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నారని, మీకిష్టమైనట్టు సినిమాలు తీయలేమని చెప్పారు. దేశంలో అసహనం అనే మాటలు మళ్లీ వినిపించాయి. అయితే పద్మావతి వివాదంపై సినీ పరిశ్రమ ఒక్కటైంది. పద్మావతి చిత్రబృందానికి బాసటగా నిలిచింది. దీనిపై ప్రతిపక్షాలు కూడా మద్దతుగా నిలిచాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది. అయినా సరే ఆ సినిమాను పట్టుబట్టి మరీ వాయిదా వేయించారు. ఇక ఈ సినిమాపై ఒకప్పటి కేంద్రమంత్రి, ప్రస్తుత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు స్పందించారు. ఈ వివాదాలు సరికాదని పేర్కొన్నారు. భారత్లాంటి ప్రజాస్వామ్య దేశంలో హింసాత్మక ఆందోళనలు, బెదిరించే ప్రకటనలు ఏమాత్రం ఆమోద్యయోగ్యం కాదని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలు కొన్ని సందర్భాల్లో అదుపు తప్పుతున్నాయని, ఇష్టమొచ్చినట్లు బెదిరింపు ప్రకటనలు, రివార్డులు ప్రకటిస్తున్నారని తెలిపారు. చట్టాలను తమ చేతిలోకి తీసుకొని ఇచ్చిమొచ్చినట్లు బెదిరింపు ప్రకటనలకు పాల్పడే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఇతరుల మనోభావాలను కించపరిచే అధికారం కూడా ఎవరికీ లేదని చెప్పారు. ఈ విధంగా చిత్ర బృందానికి, బెదిరింపుదారులకు చురకలు అంటించారు.
‘రివార్డులు ప్రకటించేవారి దగ్గర అంత డబ్బు ఉందో లేదో.. కానీ తనకు అనుమానంగా ఉంది. ప్రతి ఒక్కరు రూ. కోటికి తగ్గకుండా రివార్డు ప్రకటిస్తున్నారు. రూ.కోటి అంటే చిన్న విషయమా. ఇలాంటి విషయాలను, ప్రకటనలను ప్రజాస్వామ్యం ఆమోదించదు’ అని ఎద్దేవా చేశారు. ఈవిధంగా పద్మావతి చిత్ర వివాదంపై ఉప రాష్ట్రపతి తనదైన శైలిలో స్పందించారు. ఇరుపక్షాలకు చుకలంటించారు. ఉప రాష్ట్రపతిగా మారిన వెంకయ్యనాయుడు మాట్లాడే తీరు మాత్రం మారలేదు. అదే ఆయనలో ఉన్న గొప్ప లక్షణం.