మహబూబ్నగర్ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. భూత్పూర్ మండలం వెల్కిచర్ల గ్రామంలో తల్లి తన ముగ్గురు పిల్లలతో కలిసి బావిలో దూకి ఆత్మహత్యకు యత్నించిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో తల్లి సహా ఇద్దరు ఆడపిల్లలు ప్రాణాలు కోల్పోగా, కుమారుడు ప్రాణాలతో బయటపడినట్టు సమాచారం.
గ్రామానికి చెందిన జంగమ్మ అనే మహిళ భర్త భీరయ్యకు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇటీవల వ్యవసాయం కోసం ఆ పొలంలో బోరు వేయించగా నీళ్లు పడలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో భీరయ్య మరో చోట బోరు వేయించాలని నిర్ణయించుకున్నాడు. అయితే అప్పటికే ఒకసారి బోరు విఫలమైన కారణంగా మరోసారి బోరు వేయడం వద్దని జంగమ్మ తన భర్తను కోరినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.
అయినా భీరయ్య ఆమె మాట వినకుండా మరోచోట బోరు వేయించేందుకు ప్రయత్నించడంతో జంగమ్మ తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు ఆమెను తీవ్రంగా కలచివేసినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో జంగమ్మ తన ముగ్గురు చిన్న పిల్లలను తీసుకుని గ్రామ సమీపంలోని బావి వద్దకు వెళ్లి అందరితో కలిసి బావిలో దూకింది. ఈ ఘటనలో జంగమ్మతో పాటు ఆమె ఇద్దరు ఆడపిల్లలు అక్కడికక్కడే మృతి చెందగా, కుమారుడు మాత్రం ప్రాణాలతో బయటపడినట్లు స్థానికులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
