ఈసీ మీద ఒత్తిడి తెచ్చి చంద్రబాబు వాలంటీర్లను తప్పించారని మండిపడ్డారు వైసీపీ నేత సజ్జల. మీడియాతో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి..ఇప్పటికే కూటమి మునిగిపోయిందని…పవన్ కల్యాణ్ ది ఒక రాజకీయ పార్టీనా? అంటూ సజ్జల ప్రశ్నించారు.
ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు 60శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయిందని, రెండు మూడు రోజుల్లో 100శాతం పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పూర్తవుతుందని స్పష్టం చేశారు. రెండేళ్లు నుండి వాలంటరీ వ్యవస్థ మీద చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వాలంటీర్ల వ్యవస్థపై ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు ఇస్తే జనం తరుముతారని, తన మనిషి నిమ్మగడ్డ రమేష్ తో ఫిర్యాదు చేయించారని ఆరోపించారు.
చంద్రబాబు ఆయన బ్యాచ్ ఎన్ని కుయుక్తులు చేసినా వాలంటీర్ల వ్యవస్థను ఎవ్వరూ ఏం చేయలేరని స్పష్టం చేశారు. చంద్రబాబు చేసిన పనివల్ల పెన్షనర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. సమాజంలో ఉండే అర్హత చంద్రబాబుకు లేదని…అధికార యంత్రాంగంను ఉపయోగించుకోవాలన్న ఆలోచన వైసీపీకి లేదని సజ్జల చెప్పారు.వైఎస్ షర్మిల, సునీతతో చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని… చంద్రబాబు చేతిలో వాళ్లు పావులు అయ్యారని ఆరోపించారు.