సోషల్ మీడియా వేదికగా మహిళలపై జరుగుతున్న సైబర్ వేధింపులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహిళల ఫోటోలను మార్ఫింగ్ చేయడం, ఫేక్ వీడియోలు సృష్టించడం వంటి సైబర్ నేరాలకు పాల్పడే వారిపై ప్రభుత్వం తీవ్రంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు.
జేఎన్టీయూ ఆడిటోరియంలో నిర్వహించిన ‘స్టాండ్ విత్ హర్’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “స్టాండ్ విత్ హర్ అంటే కేవలం అందరం కలిసి నిలబడటం కాదు. సమస్యలో ఉన్న మహిళకు అండగా నిలబడి ఆమెకు న్యాయం జరిగేలా చేయడం మన బాధ్యత” అని పేర్కొన్నారు.
మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం మాత్రమే సరిపోదని, మహిళల భద్రతను నిజంగా కాపాడే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో గానీ, దేశంలో గానీ మహిళలకు సంపూర్ణ రక్షణ కల్పించామని భావించడం అసంపూర్తి ఆలోచన అని సీఎం వ్యాఖ్యానించారు.
సాంకేతికత పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయని, ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న వేధింపులను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, సినీ హీరో సాయి దుర్గ తేజ్ తదితరులు పాల్గొన్నారు. మహిళల భద్రతపై అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
