కృష్ణా జిల్లా విజయవాడ శివారులోని తాడేపల్లి గోశాలలో విషా దం చోటు చేసుకుంది. గోశాలలో 100 ఆవులు మృతి చెందాయి. మరి కొన్ని చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. శుక్రవారం రాత్రి సమయంలో పశువులకు పెట్టిన దాణాలో ఏమైనా విష పదార్థాలు కలిశాయా అనే అనుమానం వ్యక్తంచేస్తున్నారు గోశాల నిర్వహకులు.
ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు గోశాలకు తరలివచ్చారు. గోశాలలో హృదయ విదారకరంగా పడివున్న మృతదేహాలు చూసి కన్నీరు పెడుతున్నారు. ఈ గోశాలలో గతంలోనూ ఇదే విధంగా 30 గోవులు చనిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఒకేసారి 100 ఆవులు చనిపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మృతిచెందిన ఆవులకు పోస్ట్మార్టం చేసిన తరువాత వాటి మృతికి కారణం చెబుతామని వైద్యులు తెలిపారు. గోశాల నిర్వాహకుల మీద కోపంతో ఎవరైనా కావాలనే ఈ దారుణానికి పాల్పడ్డారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి దాణాపెట్టిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.