మహబూబ్నగర్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లా మాగూరు మండలం నల్లగట్టు వద్ద సోమవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
సోమవారం తెల్లవారుజామున మహేంద్ర ఎక్స్యూవీ వాహనం నిర్మాణంలో ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న విశాఖకు చెందిన అవినాష్ (26), అనిల్(26), అరవింద్(27) అనే యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు యువకులు మహేష్, మణికంఠ తీవ్ర గాయాలపాలయ్యారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్దరించారు. మద్యం సేవించి కారు డ్రైవ్ చేయడం వల్లే ప్రమాదం జరిగిందా? అన్న కోణంలో కూడా వారు దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న ఈ యువకులు వీకెండ్ ఎంజాయ్ చేయడం కోసం గోవా టూర్ వెళ్లారు. ఆదివారం రాత్రి గోవా నుంచి హైదరాబాద్ తిరిగి వస్తున్న క్రమంలో సోమవారం తెల్లవారుజామున మహబూబ్నగర్ జిల్లాల్లో కల్వర్టును ఢీకొట్టి ప్రమాదానికి గురయ్యారు