దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి హత్యకేసులో అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఆరుషి తల్లిదండ్రులు నూపుర్ తల్వార్, రాజేశ్ తల్వార్లను నిర్దోషులుగా ప్రకటించింది. సీబీఐ సరైన ఆధారాలు చూపించలేదని తల్వార్ దంపతులను నిర్దోషులుగా నిర్ణయించింది. గత తొమ్మిదేళ్లుగా దాస్నా జైలులో ఉన్న తల్వార్ దంపతులు విడుదల కానున్నారు.
2008 మే 16న ఆరుషి తన బెడ్రూంలో హత్యకు గురైంది. మొదట వారి పనిమనిషి హేమరాజ్ హత్య చేసుంటాడని అనుమానపడ్డారు. రెండ్రోజుల తర్వాత హేమరాజ్ శవం కూడా ఆరుషి ఇంటి మీద కనిపించడంతో ఈ రెండు హత్యలు ఎవరు చేసుంటారోనన్న సందిగ్ధం ఏర్పడింది. చివరికి ఆరుషి తల్లిదండ్రులు ఈ హత్యలు చేసుంటారని భావించి సీబీఐ పోలీసులు వారిని అరెస్టు ఛేశారు.
ఆరుషి ,హేమ్రాజ్ ‘అభ్యంతరకర’ స్థితిలో కనిపించడాన్ని సహించలేక తల్లిదండ్రులే హతమార్చారని దర్యాప్తు అధికారులు వాదించారు. అయితే, దర్యాప్తులో లోపాలు, మీడియా జోక్యం కారణంగా తాము ఈ కేసులో ఇరుక్కుపోయామని తల్వార్ దంపతులు మొదటి నుంచి పేర్కొన్నారు. అయితే వీళ్లు నేరం చేసినట్టు నిరూపించగల ఫోరెన్సిక్, భౌతిక సాక్ష్యాలేవీ తమ వద్ద లేవని ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపింది. ఆరుషి, హేమరాజ్ మరణానికి ముందు తల్వార్ దంపతులతో కనిపించారు కాబట్టే ఈ నిర్ణయానికి వచ్చామన్న సీబీఐ వాదనతో ప్రత్యేక కోర్టు ఏకీభవించింది. నాటి సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శ్యాంలాల్ వారిని దోషులుగా ప్రకటించింది. దీంతో వారిని ఘజియాబాద్లోని దస్నా జైలుకు తరలించారు.
సీబీఐ కోర్టు తీర్పు వినగానే తల్వార్ దంపతులు నాడు కోర్టు గదిలోనే ఏడ్చేశారు. తాము అమాయకులమని, న్యాయపోరాటం కొనసాగిస్తామని కాసేపటికి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. తల్వార్ల న్యాయవాది రెబెక్కా మాట్లాడుతూ పైకోర్టులో తమకు తప్పక న్యాయం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలా చెప్పిన ప్రకారమే వారికి అనుకూలంగా నేడు కోర్టు తీర్పు వచ్చింది. అయితె ఇప్పుడు అసలు దోషులెవరు అనేది ప్రశ్నగా మారింది. దీనిపై సీబీఐ సుప్రీంకోర్టుని ఆశ్రయించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
