కమ్యూనిస్టుల చివరి కంచుకోటగా పేరొందిన త్రిపురను కైవసం చేసుకునే దిశగా బీజేపీ సాగుతోంది. ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో 25 ఏళ్ల వామపక్ష పాలనకు చరమగీతం పాడుతూ.. బీజేపీ కూటమి సంచలన విజయం దిశగా సాగుతోంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి 40కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో నిలిచి.. సాధారణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేస్థితిలో పటిష్టంగా కనిపిస్తోంది. బీజేపీ దెబ్బకు కమ్యూనిస్టుల కంచు కోట బద్దలవుతోంది.
ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ నేతృత్వంలోని వామపక్ష కూటమి కౌంటింగ్ ప్రారంభంలో గట్టిపోటీనిచ్చినట్టు కనిపించడంతో త్రిపురలో హోరాహోరీ తప్పదని భావించారు. మొదట్లో బీజేపీ కొంత వెనుకబడినట్టు కనిపించినా.. తాజాగా అందుతున్న ట్రెండ్స్ ప్రకారం.. బీజేపీ కూటమి 42 స్థానాల్లో, వామపక్ష కూటమి 16 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. 2013 ఎన్నికల్లో త్రిపురలో బీజేపీకి ఒక్క సీటు కూడా లేకపోవడం గమనార్హం.