తిత్లీ తుఫాన్ తీరం దాటింది. ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో తీరాన్ని తాకింది. తుఫాన్ తీరాన్ని తాకిన సమయంలో భారీ ఎత్తున వీస్తున్న రాకాసిగాలులతో విద్యుత్ తీగలు తెగిపోయాయి. కరెంటు స్తంభాలు కూలిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అంథకారం నెలకొంది. ఉత్తరాంధ్రలో ఎక్కడ చూసినా భయానక పరిస్థితి నెలకొంది.
తుఫాను కారనంగా ఇప్పటి వరకు 8 మంది మృత్యువాత పడినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లాలో ఐదుగురు, విజయనగరం జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. సముద్రంలో వేటకు వెళ్లి ఆరుగురు, ఇళ్లు, చెట్టు కూలడంతో ఒక్కొక్కరు మరణించినట్లుగా అధికారులు తెలిపారు. 2 వేల కరెంట్ స్తంభాలు నేలకూలగా.. వేలాది ఎకరాల్లో పంట నష్టం సంభవించింది.
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు పూర్తిగా అంధకారంలో మునిగిపోగా.. కమ్యూనికేషన్ వ్యవస్థ స్తంభించింది. ఈదురుగాలుల కారణంగా వేలాది చెట్లు నేలకూలాయి. రోడ్లపై అడ్డంగా భారీ వృక్షాలు పడటంతో రోడ్ నెట్ వర్క్ పూర్తిగా స్తంభించింది.పలు రైల్లను రద్దు చేసింది రైల్వే. తీర ప్రాంతాలకు వెళ్లే అన్ని మార్గాల్లో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.