ఉత్తరాఖండ్ లో పెను విపత్తు సంభవించింది. మంచు చరియలు విరిగిపడడంతో ఓ విద్యుత్ కేంద్రాన్ని వరద నీరు ముంచెత్తింది. ఈ ప్రమాదంలో 150 మంది కార్మికులు గల్లంతయిన విషయం తెలిసిందే. ధౌలిగంగా నది ఒక్కసారిగా ఉప్పొంగడంతో మంచు చరియలు విరిగిపోయి ప్రళయం ఏర్పడింది. నదికి ఆకస్మికంగా వరద రావడంతో ఆ ధాటికి దిగువన ఉన్న డ్యామ్ ధ్వంసమైంది. నీటి ప్రవాహ ఉద్ధృతికి ఆనకట్ట కొట్టుకుపోయింది.
జల ప్రళయంలో చిక్కుకున్న 16 మంది కార్మికులను రక్షించిన సహాయక బృందాలు ఇప్పటి వరకు 14 మృతదేహాలను వెలికి తీశాయి. నేటి ఉదయం తిరిగి సహాయక చర్యలు ప్రారంభం కాగా, తపోవన్ సొరంగంలో చిక్కుకుపోయిన వారిని గుర్తించేందుకు ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.
సొరంగాల్లో మరో 30 మంది వరకు చిక్కుకుని ఉండొచ్చని, వారిని రక్షించేందుకు 300 మంది జవాన్లు శ్రమిస్తున్నారని ఐటీబీపీ అధికార ప్రతినిధి వివేక్ పాండే తెలిపారు. అయితే గల్లంతయిన వారిలో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. గల్లంతైన వారంతా ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.