ఉత్తరాఖండ్ హెడ్ కోచ్గా ఇటీవల రాజీనామా చేసిన టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ తనపై వస్తున్న ఆరోపణలను ఖండించాడు. హెడ్ కోచ్ గా ఉన్నప్పుడు మతం ఆధారంగా ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చినట్టు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని అన్నాడు. తన చర్యలను అధికారులు తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నాడు. తనపై వస్తున్న ఆరోపణల్లో నిజానిజాలు తెలిపేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ..’క్రికెట్లోకి మతపరమైన అంశాలనుతేవడం బాధ కలిగించింది. ఇక్బాల్ అబ్దుల్లాను కెప్టెన్ చేసేందుకు ప్రయత్నించినట్లు నాపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. తొలుత జై బిస్టాను కెప్టెన్ను చేయాలని భావించా. కానీ రిజ్వాన్ సహా ఇతర సెలక్టర్లంతా ఇక్బాల్ను కెప్టెన్ను చేయమని సూచించారు. దాంతోపాటు ఇక్బాల్కు ఐపీఎల్లో కూడా అనుభవం ఉండడంతో వారి నిర్ణయంతో ఏకీభవించాల్సి వచ్చింది. అలాగే బయోబబుల్లోకి మత గురువులను తీసుకొచ్చానని.. అక్కడ మేం అందరం కలిసి నమాజ్ చేసినట్లు అధికారులు ఆరోపించారు. ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నా. డెహ్రాడూన్లో ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరంలో రెండు శుక్రవారాలు మాత్రమే మౌలానా వచ్చారు. ఆయన్ని రమ్మని నేనెప్పుడు కోరలేదు. కేవలం శుక్రవారం ప్రార్థనల కోసమే ఇక్బాల్ అబ్దుల్లాతో నాతో పాటు జట్టు మేనేజర్ అనుమతి కోరాడు. ప్రాక్టీస్ పూర్తయ్యాకే మేం ప్రార్థనలు చేశాం. కానీ ఈ విషయాన్ని అధికారులు ఎందుకంత సీరియస్గా తీసుకున్నారో అర్థం కావడం లేదు’ అని జాఫర్ పేర్కొన్నారు.
కాగా, ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్, సెలక్టర్లు, సంఘం కార్యదర్శి తనపై పక్షపాతం చూపించారని చెప్తూ వసీం జాఫర్ మంగళవారం హెడ్కోచ్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇక వసీం జాఫర్ హెడ్ కోచ్ గా ఉత్తరాఖండ్ జట్టు ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పేలవ ప్రదర్శన చేసింది. టోర్నీ మొత్తంలో ఐదు మ్యాచ్ల్లో కేవలం ఒకేఒక్క విజయం సాధించి నిరాశపరిచింది. ఇదిలావుండగా రంజీ క్రికెట్ చరిత్రలో అత్యధికంగా 12 వేలకు పైగా పరుగులు సాధించిన రికార్డు వసీం జాఫర్ పేరిట ఉంది. భారత జట్టు తరఫున 31 టెస్టులు ఆడిన జాఫర్ 2 డబుల్ సెంచరీలు, 5 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీల సాయంతో 1944 పరుగులు చేశాడు.
Also Read
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల