అమ్మాయి ఫోన్లో మాట్లాడుతోందనీ, వాట్సాప్ లో ఎక్కువ సేపు ఉందని గతంలో పెళ్లిళ్లు రద్దు కావడాన్ని మనం చూసుంటాం. అయితే మరికొద్ది గంటల్లో పెళ్లి కావాల్సిన సమయంలో పెళ్లికొడుకు మండపం నుంచి పరారయ్యాడు. దీంతో వధువు తల్లి, దండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెల్తే….జిల్లాలోని తనకల్లు మండలం టీ సదుంకు చెందిన రఫీకి కదిరిలోని నిజాంవలి కాలనీకి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమయింది. గురువారం ఉదయం 11.30 గంటలకు కదిరిలోని టైటానిక్ ఫంక్షన్ హాల్లో నిఖా(వివాహం) జరగాల్సి ఉంది. పెళ్లి సమయానికి పెళ్లికొడుకు పరారయ్యాడు.
అయితే వివాహ సమయంలో పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు స్వచ్ఛమైన బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు అనుగుణంగానే అమ్మాయివారు 10 తులాల బంగారం అందించారు. ఇది స్వచ్ఛమైన బంగారం కాదని అబ్బాయి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అయితే పెద్ద మనుషులు ఇరుకుటుంబాలకు నచ్చజెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.
పెళ్లితో పాటు ఇతర ఏర్పాట్లకు రూ.లక్ష వరకూ ఖర్చు అయిందని అమ్మాయి తల్లిదండ్రులు ఫిర్యాదులో తెలిపారు. అబ్బాయి మంచివాడని చెప్పడంతో వివాహానికి అంగీకరించామని వెల్లడించారు. కానీ అతను ఇంత మోసగాడని తెలుసుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
వేరే కుటుంబం తమ కంటే రూ.50,000 ఎక్కువ కట్నం ఇస్తానని చెప్పడంతోనే పెళ్లి నుంచి రఫీ పరారయ్యాడని వారు ఆరోపించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.