మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు రాష్ట్రంలో పెనుసంచలనం సృష్టించింది. ఈ హత్య రాజకీయ రంగు పలుము కోవడంతో వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం తారాస్ధాయిలో జరిగిన విషయం తెలిసిందే. ఈకేసును దర్యప్తు చేయడానికి ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. అయితే సిట్పై తమకు నమ్మకం లేదని సీబీఐ చేత విచారణ జరిపించాలని వైఎస్ జగన్, వైఎస్ సౌభాగ్యమ్మ ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించిన హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరఫున అండర్ టేకింగ్ ఇవ్వాలని ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ను హైకోర్టు ఆదేశించింది. ఈ హత్య ఘటనపై ఎవరు వ్యాఖ్యానించరాదని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు వైఎస్ జగన్మోహన్రెడ్డి తరపున.. న్యాయవాదులు అండర్ టేకింగ్ ఇచ్చారు. అలాగే ఈ కేసుకు సంబంధించి పోలీసులు, సిట్ సైతం మీడియాకు వివరాలు అందించడానికి వీలు లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా వేసింది.