భారత్ వాయుసేన మరింత బలోపేతం కానుంది. అమెరికాకు చెందిన అత్యాధునిక యుద్ధ హెలికాప్టర్లు అపాచీ-64 లు భారత వైమానికి దళంలోకి చేరాయి.పఠాన్కోట్ వైమానిక స్థావరం నుంచి ఈ యుద్ధ హెలికాప్టర్లు గాల్లోకి ఎగిరాయి. అంతకంటే ముందు ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా, వెస్ట్రన్ ఎయిర్ కమాండర్ ఎయిర్ మార్షల్ ఆర్ నంబియార్తో పాటు పలువురు పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ ఇప్పటికే 4 హెలికాప్టర్లను అందజేయగా తాజాగా 8 అధునిక అపాచీ యుద్ధ హెలికాప్టర్లను అందజేసింది. 22 అపాచీ హెలికాప్టర్ల కొనుగోలుకు 2015 సెప్టెంబర్లో భారత వాయుసేన బోయింగ్ సంస్థతో ఒప్పందం చేసుకోగా 2020 నాటికి మొత్తం 22 హెలికాప్టర్లు భారత్కు చేరనున్నాయి. ఇప్పటి వరకు 2,200 అపాచీ హెలికాప్టర్లను వేర్వేరు దేశాలకు బోయింగ్ సంస్థ అందించింది. అపాచీ యుద్ధ హెలికాప్టర్లను ఉపయోగిస్తున్న దేశాల్లో భారత్ 16వ దేశం.
అత్యాధునిక యుద్ధ హెలికాప్టరైన అపాచీ అన్ని వాతావరణ పరిస్థితుల్లో పని చేస్తుంది.ఈ హెలికాప్టర్కు సంబంధించి అన్ని రకాల ముందస్తు పరీక్షలు పూర్తి చేశామని వాయుసేన అధికారులు ప్రకటించారు. గగనతలంలోని, నేలపై ఉన్న టార్గెట్లను ఈ హెలికాప్టర్లు ఛేదిస్తాయి.