తెలంగాణ తెలుగుదేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మహానాడు జరిగి ఇంకా కొన్ని గంటలైనా గడవలేదు… తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు అహర్నిశలూ కృషి చేస్తాం అంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించి ఒక రోజైనా పూర్తి కాలేదు. ఈలోగానే తెలంగాణకు చెందిన మరో ప్రముఖ దేశం నేత తెరాసలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి.
తెలుగుదేశం తరఫున పార్లమెంటు సభ్యుడిగా ఉన్న మల్లారెడ్డి… ఆ పార్టీకి గుడ్బై చెప్పేయబోతున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అధికార పార్టీ వేడుకలు నిర్వహిస్తుంది కదా. సరిగ్గా ఆ వేడుకల్లోనే గులాబీ కండువా కప్పేసుకుందామని ఆయన నిర్ణయించుకున్నట్టు, ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్టు తెలంగాణ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
గ్రేటర్ ఎన్నికల వరకూ ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాయి. అయితే, గ్రేటర్ ఫలితాల తరువాత తన రాజకీయ భవిష్యత్తు గురించి మల్లారెడ్డి ఆలోచనల్లో పడ్డారని కొంతమంది అనుచరులు చెబుతున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా లేకుండా పోయినట్టయింది. తెరాస 99 డివిజన్లలో విజయం సాధించడంతో ఏం చేయాలో దేశం నేతలకు అర్థం కాని పరిస్థితి అయింది. ఈ నేపథ్యంలో తీవ్ర మేథోమథనం అనంతరం ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి బయటకి వచ్చేద్దామని నిర్ణయించుకున్నట్టు రాజకీయ వర్గాల్లో తెలుస్తోంది. మల్లారెడ్డికి వియ్యంకుడు ప్రముఖ నేత, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కూడా తెలుగుదేశం పార్టీని విడిచి, తెరాసలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వియ్యంకుడి బాటలోనే ఈయన కూడా చేరతారని అంటున్నారు. మరి, ఈ వార్తలను మల్లారెడ్డి ఖండించకుండా ఉంటే, అనుమానించాల్సిందే!