హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుపై రంగారెడ్డి జిల్లా నార్సింగ్ వద్ద కాల్పుల కలకలం రేగింది. బెంజ్ కారులో వచ్చిన వ్యక్తి తుపాకీతో కాల్చుకున్న ఘటన చోటు చేసుకుంది.మొదట, ఇదేదో గ్యాంగ్ వార్ అనుకుని భయపడిన స్థానికులు, ఆ తర్వాత కారువద్దకు వచ్చి చూడగా అపస్మారక స్థితిలో వ్యక్తి కనిపించాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ఘటనా సమయంలో శంషాబాద్ నుంచి హైదరాబాద్ వస్తున్నట్టు తెలుస్తోంది. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ఘటనా స్థలంలో క్లూస్ సేకరించారు. ఈ వాహనం అశ్విన్ జైన్ అనే వ్యక్తిపై రిజిస్ట్రేషన్ చేసి ఉండడంతో అశ్విన్ జైనే కాల్చుకున్నాడని మొదట భావించినా… ఆత్మహత్యాయత్నం చేసింది ఫైజాన్ అహ్మద్ అనే వ్యక్తిగా నిర్ధారించారు పోలీసులు.
బాధితుడు హైదరాబాద్లో యూఎస్ కన్సల్టెన్సీ నడుపుతున్నట్టు వెల్లడించారు. ఫోర్ వీల్స్ అనే నుంచి బెంజ్ కారును ఉదయం అద్దెకు తీసుకొని వెళ్లిన ఫైజాన్.. సాయంత్రం ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనలో పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఆత్మహత్యకు పాల్పడే వ్యక్తి అయితే తుపాకీ తలకు గురిపెట్టి పేల్చుకుంటాడని, కానీ బుల్లెట్ గాయాలు ఒంటిపై ఉండడం చూస్తుంటే, కారులో మరెవరైనా ఉండి కాల్పులకు పాల్పడ్డారా? అనే కోణంలో సందేహాలు వస్తున్నాయి.