బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ధర్నా చేసిన కేసు ఇప్పుడు బాబు మెడకు చుట్టుకుంటోంది. ఒక వైపు తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు మరో వైపు నిన్నొదలా బాబూ అంటూ వెంటాడుతన్న బాబ్లీ ప్రాజెక్టు కేసుతో ఇరుకున పడ్డారు ఏపీ సీఎం. ఇప్పటికే బాబుతో సహా మొత్తం 15 మంది నాయకులకు నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో బాబు అండ్ కో తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
ఇదిలా ఉంటే నాందేడ్ ఎస్పీ కతార్ మరో పిడుగు లాంటి వార్త పేల్చారు. బాబ్లీ ప్రాజెక్టు వద్ద జరిగిన ఘర్షణలపై ఎనిమిదేళ్ల నుంచి విచారించలేదని వస్తున్న ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. తాము ఐదేళ్లకు పూర్వమే చార్జిషీట్ దాఖలు చేశామని, ఆ ప్రతులను నిందితులుగా పేర్కొన్న అందరికీ పంపించామని ఆయన స్పష్టం చేశారు. పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులను అడ్డుకున్నారన్న ఆరోపణలు వారిపై నమోదయ్యాయని, అప్పటి వీడియోలు, ఫొటోలు సాక్ష్యాలుగా ప్రవేశపెట్టినట్టు ఆయన చెప్పారు.
16 మందిపై చార్జ్ షీట్ దాఖలైందని, కేసులో అభియోగాలు నమోదు చేశాక, విచారణ ఆసాంతం కోర్టు పరిధిలోనే ఉంటుందని గుర్తు చేశారు. వారిని ఎప్పుడు విచారణకు పిలవాలన్న విషయం కోర్టు చూసుకుంటుందని, వారు రాకుంటే, కోర్టు నుంచి ఆదేశాలు అందిన తరువాత తాము అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెడతామని హెచ్చరించారు.
చంద్రబాబు సహా 16 మంది నిందితులకు 21వ తేదీలోపు కోర్టులో హాజరు పరచాలని ధర్మాబాద్ కోర్టు నుంచి తమకు ఆదేశాలు అందాయని, ఆలోగా నిందితులు వచ్చి హాజరవుతారనే భావిస్తున్నామని తెలిపారు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వడం కోర్టు విచక్షణాధికారమని అభివర్ణించిన ఆయన, చంద్రబాబు సహా ఇతర నిందితులు కోర్టుకు రాకుంటే, న్యాయ నిపుణుల సలహా తీసుకుని, వారిని అరెస్ట్ చేసి తరలిస్తామని చెప్పారు.