ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ గోదాములపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ముంబయిలోని అంధేరి శివారు, పుణెలోని కొంద్వాలలో ఈ ఘటనలు జరిగాయి. అమెజాన్ పోస్టర్లు, వెబ్సైట్, యాప్లోని నావిగేషన్ వ్యవస్థకు మరాఠీ భాషను వినియోగించకపోవడంపై కొంతకాలంగా ఎంఎన్ఎస్ అభ్యంతరం చెబుతోంది. ఈ నేపథ్యంలోనే ‘నో మరాఠీ నో అమెజాన్’ అంటూ నినదిస్తూ ఆ కంపెనీ గిడ్డంగులపై కార్యకర్తలు విరుచుకుపడ్డారు.
అంధేరిలోని గిడ్డంగిలో ఎల్ఈడీ టీవీ, ల్యాప్టాప్లు తదితరాలు ధ్వంసమయ్యాయని పోలీసులు తెలిపారు. సకినాక పోలీస్స్టేషన్లో 8 మందిపై కేసు నమోదైంది. పుణె ఘటనకు సంబంధించి 10 మంది గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. తమ సంస్థ కార్యకలాపాలకు ఎంఎన్ఎస్, దాని అనుబంధ కార్మిక సంఘం అవరోధాలు కలిగిస్తున్నాయని ఆరోపిస్తూ అమెజాన్ కంపెనీ కొద్దిరోజుల క్రితం దిండోషి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. జనవరి 5న కోర్టులో హాజరుకావాలని ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ఠాకరేకు నోటీసు జారీ అయిన నేపథ్యంలో దాడి ఘటన చోటుచేసుకుంది.