భారతీయ స్టేట్ బ్యాంక్ తనలో విలీనం చేసుకున్న ఆరు బ్యాంకుల ఖాతాదారులు ఇంకా పాత చెక్బుక్, ఐఎఫ్ఎస్ కోడ్లే వాడుతున్నారా? అయితే త్వరగా మార్చేసుకోండి. 2017 డిసెంబర్ 31 నుంచి ఎస్బీఐ తన విలీనం చేసుకున్న ఆరు బ్యాంకుల ఖాతాదారులకు చెందిన పాత చెక్బుక్లు, ఐఎఫ్ఎస్సీ కోడ్లు చెల్లవు.
ఈ బ్యాంక్ ల ఖాతాదారులు ఇబ్బంది పడకుండా ఉండాలంటే వెంటనే తమ పాత చెక్ బుక్ లను మార్చుకోవాలని, ఐఎఫ్ఎస్ సీ కోడ్ లను తెలుసుకోవాలని ఎస్బీఐ తన ఖాతాదారులకు సూచించింది. వాస్తవానికి పాత్ చెక్ బుక్ లను మార్చుకునేందుకు సెప్టెంబర్ 30వ తేదీని ఎస్బీఐ గడువుగా నిర్ధారించింది. ఆ తర్వాత గడువును డిసెంబర్ 31కు పొడిగించింది.
ప్రస్తుతం గడువు దగ్గర పడుతుండటంతో… ఎస్బీఐ మరోసారి సూచన చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ రాయ్ పూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్ కోర్ సహా భారతీయ మహిళా బ్యాంకులు ఎస్బీఐలో విలీనమయ్యాయి. కొత్త చెక్ బుక్ లను పొందడానికి బ్యాంకు శాఖను సంప్రదించవచ్చని, లేకపోతే ఏటీఎం, ఎస్బీఐ మొబైల్ యాప్ ద్వారానైనా వీటిని పొందవచ్చని ప్రకటించింది.
ఎస్బీఐ కూడా మేజర్ సిటీల్లో ఉన్న బ్రాంచు పేర్లను, బ్రాంచు కోడ్లను, ఐఎఫ్ఎస్సీ కోడ్లను మారుస్తోంది. ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్కత్తా, పాట్న, అహ్మదాబాద్, భోపాల్, అమరావతి, చంఢీగర్, జైపూర్, తిరువనంతపురం, లక్నో వంటి నగరాల్లో ఎస్బీఐ బ్రాంచు పేర్లను, బ్రాంచు కోడ్లను, ఐఎఫ్ఎస్సీ కోడ్లను మార్చేసింది.