మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉందా? ఎస్బీఐ బ్యాంకుల్లో లావాదేవీలు ఎక్కువగా చేస్తుంటారా? బ్యాంక్లో రుణం తీసుకున్నారా? లేదంటే కొత్తగా లోన్ తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీకో ముఖ్య గమనిక. మే 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. మీకు ఎస్బీఐలో అకౌంట్ ఉంటే ఈ నిబంధనల గురించి వినియోగదారులందరూ తప్పక తెలుసుకోవాల్సిన ఈ విషయాలను ఎస్బీఐ వెల్లడించింది.
మే ఒకటో తేదీ నుంచి రుణాలు, డిపాజిట్లు రెపో రేటుతో అనుసంధానం కానున్నాయి. ఫలితంగా రుణ, రెపో రేటుతో డిపాజిట్ రేట్లను అనుసంధానించనున్న తొలి బ్యాంకుగా ఎస్బీఐ రికార్డులకెక్కింది. దీంతో రుణాలను తీసుకోవడం మరింత సులభం అవుతుంది.
కొత్త నిబంధనల ప్రకారం మే 1 నుంచి డిపాజిట్లపై వడ్డీ రేట్లు మారనున్నాయి. ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్ ఉన్నవాళ్లు రూ.1 లక్ష కన్నా ఎక్కువ డిపాజిట్లపై తక్కువ వడ్డీ పొందుతారు. 0.25-0.75 శాతం మధ్య వడ్డీ రేట్లు తగ్గే అవకాశముంది. అంటే మే 1 నుంచి రూ.1 లక్ష వరకు డిపాజిట్లపై 3.50 శాతం వడ్డీ లభిస్తోంది. అంతకన్నా ఎక్కువ డిపాజిట్లపై 3.25 శాతం వడ్డీ ఇవ్వనుంది ఎస్బీఐ. అంటే ఇప్పుడీ రుణాలపై వడ్డీ రేటు 8.6-8.9 శాతం మధ్య ఉండనుంది.
రెపో రేటు అనుసంధానంతో కస్టమర్లకు లాభం చేకూరనుంది.బ్యాంకులు వాటి రుణ రేట్లను ఎంసీఎల్ఆర్ ప్రాతిపదికన నిర్ణయిస్తాయి. అయితే బ్యాంకులు చాలా సందర్భాల్లో రెపో రేటు తగ్గింపు ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేయలేదు. బ్యాంకులు రుణ రేట్లను రెపో రేటుతో అనుసంధానిస్తే.. రెపో రేటు తగ్గినప్పుడల్లా ఈఎంఐ భారం తగ్గుతుంది. రూ.లక్షకు పైన ఉన్నా రుణాలకే రేట్లను రెపోరేటుతో అనుసంధానిస్తారు.