తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయడానికి కొత్త గేమ్ కు ప్లాన్ చేశారా? ఒకవైపు ఎమ్మెల్యేలు కట్టుదాటి టీఆర్ఎస్ వైపు చేరిపోతున్న తరుణంలో వారిని కాపాడుకోవడం మాట ఎలా ఉన్నా..
పార్టీ జనాల్లో వీక్ కాకుండా చూసుకోవడానికి కొత్త ఎత్తును వేస్తున్నాడా. వెళ్లిపోయినవాళ్లు పోనీ.. ఉన్న వాళ్లతోనే పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడా?
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. త్వరలో జరగనున్న మహానాడులో తెలుగుదేశం పార్టీ తెలంగాణ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడి పగ్గాలు రేవంత్ కు దక్కనున్నాయని తెలుస్తోంది. మొదట్లో ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు లోకేష్ కు దక్కుతాయని అనుకొన్నా.. ప్రస్తుతానికి అలాంటి ఆలోచనను బాబు మార్చుకొన్నారట. వీటిని సరైన తెలంగాణ వ్యక్తి చేతిలో పెట్టడమే రైటు అని బాబు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇప్పుడు తెలంగాణ వర్కింగ్ కమిటీ బాధ్యతను లోకేష్ కు అప్పజెప్పితే తెలంగాణ రాష్ట్రసమితి వాళ్లు విరుచుకుపడి విమర్శలు చేయడానికి అవకాశం ఇచ్చినట్టే అవుతుంది. అందుకే బాబు తెలివిగా రేవంత్ కు ఆ అవకాశం ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే పగ్గాలు శాశ్వతంగా రేవంత్ కు అప్పినట్టు కాదు.
తీరా నిజంగానే తెలుగుదేశం పార్టీ కోలుకొంటే.. అప్పుడు లోకేష్ ను ఎలా మళ్లీ రంగంలోకి దించాలో బాబుకు తెలుసు. అప్పుడు తెలివిగా రేవంత్ ను పక్కకు తప్పించే అవకాశాలున్నాయి. స్థూలంగా ప్రస్తుతానికి రేవంత్ రెడ్డిని బాబు ఉపయోగించుకొంటున్నాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పార్టీ తమ చేతిలో ఉంటే వచ్చే నష్టాన్ని గ్రహించి.. దాన్ని రేవంత్ కు అప్పగించి లాభపడే వ్యూహంతో ఉన్నాడట బాబు. మరి ఈ గేమ్ ఏ మేరకు వర్కవుటవుతుందో!