కేంద్రం లో జరిగిన మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు మహారాష్ట్ర లో పెను సంచలనం సృష్టిస్తోంది. మోడీ క్యాబినెట్ లో చాలా మంది పాతవారిని పీకేసి మరీ కొత్తవారికి అవకాశాలు ఇచ్చారు. కొంతమంది పాతవారిని శాఖా పరమైన మార్పులు కూడా చేసారు. అయితే మంత్రి వర్గ విస్తరణ లో సీట్ లు ఆశించిన శివసేన పార్టీ కి మోడీ భారీగా హ్యాండ్ ఇచ్చేసారు. క్యాబినెట్ విస్తరణ లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా వారికి రాకపోవడం పట్ల ఆ పార్టీ చాలా సీరియస్ గా ఉంది. తాజా క్యాబినెట్ విస్తరణలో శివసేనకు మరో మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయంటూ ఊహాగానాలు కూడా జోరుగా వీచాయి.
అయితే, వారి అంచనాలు తల్లకిందులు చేస్తూ… ఆ పార్టీకి అవకాశం ఇవ్వలేదు భాజపా సర్కారు! దీంతో ఆ అసంతృప్తికి ఇంకోలా వెళ్లగక్కుతున్నారు పార్టీ అధినేత ఉద్దవ్ థాక్రే. తమకు పదవులు కావాలని ఏనాడూ దేబరించలేదని, పదవులు తాము ప్రాధాన్యత ఇవ్వమని ముంబయిలో జరిగిన మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు!తమకు ఎంతో ఆత్మగౌరవం ఉండనీ, అదే తమ పార్టీ సిద్ధాంతమని థాక్రే అన్నారు. ఎప్పుడూ ఎవ్వరినీ దేనికోసమూ అడుక్కోబోమని ఆయన స్పష్టం చేశారు.
కేబినెట్ పదవుల కోసం తాము ఏనాడూ అర్రులు చాచలేదనీ, ఎవ్వరి గడపా తొక్కలేదనీ, మంత్రి పదవులు ఇప్పించండీ అంటూ ఎవ్వరి తలుపులూ కొట్టలేదని ఉద్ధవ్ వ్యాఖ్యానించారు. ప్రజల్లో ఉంటూ వారికి సేవ చేసుకోవడమే తమ ముఖ్యోద్దేశం అన్నారు.ఈయన వాఖ్యలు విన్నవారికి ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది… మంత్రి పదవులపై ఆ పార్టీ ఎన్ని ఆశలు పెట్టుకుందో అని! ఒకవేళ మంత్రి పోస్టులకు ప్రాధాన్యత మొదట్నుంచీ ఇవ్వకపోతే ఇప్పుడు ఇలా ఆవేశంగా స్పందించాల్సిన అవసరం కూడా ఉండదు కదా. నిజానికి, శివసేన పార్టీ భాజపా మిత్రపక్షమే అయినా కూడా… పక్కలో బల్లెంగా వ్యవహరిస్తూ ఉంటుంది.