ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమిపై కుమిలిపోతున్నారు టీడీపీ శ్రేణులు. ఓటమినుంచి తేరుకొని ఇప్పుడిప్పుడే నాయకులు బయటకు వస్తున్నారు. ఇక టీడీపీ అధినేత బాబు, నారాలోకేష్లు బయటకు వచ్చారు. ఎన్టీయార్ 97వ జయంతి సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి లోకేశ్ నివాళులు అర్పించారు. ఈసందర్భంగా లోకేష్ పార్టీ కార్యకర్తలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
టీడీపీ ఓటమికి గల కారణాలను సమీక్షించకుండా ఆ నిందను కార్యకర్తలపై లోకేష్ వేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. చంద్రబాబును సొంత పార్టీ నేతలే మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవీఎంలు పదిశాతం మోసం చేస్తే.. పార్టీ నమ్ముకున్న నేతలు 90 శాతం మోసం చేశారని లోకేష్ అన్నారు.గల్లా జయదేవ్ వంటి నేతలే గెలవంగా మిగతావారు ఎందుకు ఓడిపోయారని అసహనం వ్యక్తం చేశారు. నేతల మధ్య సమన్వయం, ప్రత్యర్థిని దీటుగా ఎదుర్కొలేకపోవడం మూలంగానే ఓటమి చెందామని ఆయన అభిప్రాయపడ్డారు
టీడీపీ కార్యకర్తలను కాపాడుకొనే బాధ్యత తమదేనన్నారు.కార్యకర్తల జోలికి వస్తే చూస్తూ ఊరుకొనేది లేదన్నారు. 2024లో మంగళగిరిలో టీడీపీ జెండా ఎగురవేస్తామని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడతానన్నారు.