తెలంగాణలో కరోనా వైరస్ మరోసారి వేగంగా విస్తరిస్తున్నాయి. నిన్న రాత్రి 8 గంటల వరకు 1,02,335 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 5,567 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఓ వైపు వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకు వచ్చినా.. ప్రజల నిర్లక్ష్య వైఖరి వల్ల కేసుల సంఖ్య మరింత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ తీసుకు వచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 50వేలకు చేరువగా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 49,781 యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది. రాష్ట్రంలో నిన్న ఒకే రోజు 1, 02,335 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. బుధవారం ఒక్క రోజే మరో 23 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. ఇక రాష్ట్రంలో కొత్తగా చనిపోయిన 23 మంది మృతితో కలుపుకుని మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,899కి చేరింది.
తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 989, మేడ్చల్లో 421, రంగారెడ్డిలో 437, నిజామాబాద్లో 367, మహబూబ్నగర్లో 258 కొవిడ్ కేసులు రికార్డయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 3.73 లక్షలకు చేరింది. ఇందులో 3.21 లక్షల మంది డిశ్చార్జ్ కాగా, 49,781 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.