ఐపీఎల్లో భాగంగా గత రాత్రి చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ పోరాడి ఓడింది. బుధవారం జరిగిన భారీ స్కోర్ల మ్యాచ్లో చెన్నై 18 పరుగుల తేడాతో కోల్కతా నైట్రైడర్స్ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సిఎస్కె 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన కోల్కతా 19.1 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. కోల్కతా నైట్రైడర్స్ మొదట్లోనే తడబడ్డారు.. 31 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన కోల్కతాను ఆండ్రీ రసెల్, దినేశ్ కార్తీక్ ఆదుకున్నారు.
రసెల్ 22 బంతుల్లోనే ఆరు సిక్సర్లు, మరో మూడు ఫోర్లతో 54 పరుగులు చేశాడు. ఇక కార్తీక్ 24 బంతుల్లో రెండు సిక్స్లు, మరో 4 ఫోర్లతో 40 పరుగులు సాధించాడు. చివర్లో కమిన్స్ 34 బంతుల్లోనే ఆరు సిక్సర్లు, మరో 4 ఫోర్లతో అజేయంగా 66 పరుగులు చేశాడు. జట్టులో నలుగురు ఆటగాళ్లు.. శుభ్మన్ గిల్, కమలేశ్ నాగర్కోటి, వరుణ్ చక్రవర్తి డకౌట్లు కాగా, ప్రసిద్ధ్ కృష్ణ పరుగులేమీ చేయకుండా నాటౌట్గా నిలిచాడు. నితీశ్ రాణా (9), రాహుల్ త్రిపాఠీ (8), కెప్టెన్ మోర్గాన్ (7), సునీల్ నరైన్ (4) దారుణంగా విఫలమయ్యారు.
చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ నాలుగు వికెట్లు తీసుకోగా, లుంగి ఎన్గిడి 3, శామ్ కరణ్ ఒక వికెట్ పడగొట్టాడు. చెన్నై ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్ (64), డుప్లెసిస్ (95, నాటౌట్) వీర విజృంభణతో స్కోరు ఉరకలెత్తింది. కోల్కతా బౌలర్లలో చక్రవర్తి, నరైన్, రసెల్ చెరో వికెట్ తీసుకున్నారు. అద్భుత ఆటతీరుతో చెన్నైకి విజయాన్ని అందించిన డూ ప్లెసిస్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్లు ఆడి మూడింటిలో విజయం సాధించిన చెన్నై ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.