ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో పరిధిలోని 132 గ్రామాల్లో విడ్డూరం చోటు చేసుకుంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 132 గ్రామాల్లో గత మూడు నెలల కాలంలో ఒక్క ఆడ శిశువు కూడా జన్మించలేదు. ఒక పక్క ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నా వాస్తవంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. మూడు నెలల కాలంలో 216 మంది జన్మించగా, వారిలో ఒక్కరంటే ఒక్క అమ్మాయి కూడా లేకపోవడం దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది.
ఈ ప్రాంతంలో భ్రూణ హత్యలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయని సమాచారం. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించకుండా అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, క్షేత్ర స్థాయిలో ఫలితాలు మాత్రం దక్కడం లేదు.ఈ అంశంపై కలెక్టర్ అత్యవసర సమావేశం పెట్టి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దీని వెనుకున్న కారణాలను తెలుసుకునేందుకు సమగ్ర సర్వే, అధ్యయనం చేపడతామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆశిష్ చౌహాన్ తెలిపారు. పరిస్థితిని సమీక్షించేందుకు ఆశా వర్కర్లతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు.
మూడు నెలల కాలంలో వందకు పైగా గ్రామాల్లో ఒక్క ఆడ శిశువు కూడా జన్మించకపోవడం కాకతాళీయంగా జరిగింది కాదని, దీని వెనుక కుట్ర ఉందని సామాజిక కార్యకర్త కల్పనా థాకూర్ ఆరోపించారు. ఉత్తర కాశీలో ఆడపిల్లలు పుట్టకుండా చేసేందుకు భ్రూణహత్యలు జరుగుతున్నాయన్న అనుమానాన్ని ఆమె వ్యక్తం చేశారు.
సీనియర్ జర్నలిస్టు శివసింగ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఆడపిండాల హత్యలను నివారించేందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ చేశారు. ఆడ శిశువులను గర్భంలో ఉండగానే చంపేస్తున్నారని అధికారిక లెక్కలను బట్టి అర్థమవుతోంది. ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టి అనాగరిక చర్యలకు అడ్డుకట్టవేయాల’ని అన్నారు.