ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకుల ఆగడాలు శృతి మించుతున్నాయి. వీరి దాడులకు ప్రజలు సతమతమవుతున్నారు. ఇప్పుడు రైతులపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దాడికి పాల్పడ్డారు. తమకు రావాల్సిన పరిహారం రైతులు అడిగితే ఏకంగా తన కార్యాలయానికి పిలిపించి.. బంధించి రైతులను చితకబాదడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
ఒకప్పుడు బుజ్జగింపు మాటలతో రైతుల నుంచి రాజధాని నిర్మాణం కోసం భూములు లాక్కున్న అధికార పార్టీ ఇప్పుడు రైతులకు పరిహారం ఇవ్వడంలో తీవ్రంగా మొండి వైఖరి అవలంభిస్తున్నారు. దాడికి పాల్పడడమే కాకుండా, రూములో ఉన్న వారిని కాలర్ పట్టుకుని ఈడ్చి.. ఈడ్చి.. మెట్లమీద పడేశారు. దీంతో భూ నిర్వాసితులు పోరుబాట పట్టారు.
గన్నవరం విమానాశ్రయానికి మరిన్ని హంగులు దిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూమి సేకరణ చేపట్టింది. 1974 నుంచి భూమిని సాగు చేసుకుంటున్న షేక్ హైదర్ సాహెబ్, మేడూరి తిరుపతయ్య నుంచి కూడా 10 సెంట్ల స్థలాన్ని సేకరించారు. కానీ పరిహారం మాత్రం ఇంతవరకు చెల్లించలేదు. వారి భూముల్లో పనులు చేసుకుంటున్నా అధికార పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారు. దీంతో విసుగెత్తిన షేక్ హైదర్ సాహెబ్, మేడూరి తిరుపతయ్య తమ భూములు తిరిగివ్వండి లేదా భూ పరిహారం అయినా చెల్లించాలంటూ డిమాండ్ చేశారు.
ఈ విషయం తెలుసుకున్న గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భూ నిర్వాసితులిద్దరినీ పిలిపించి తన కార్యాలయంలోని ఒక రూములో బంధించి, తన సిబ్బందితో కొట్టించారు. ఆపై ఇద్దరి షర్టు కాలర్లను పట్టుకుని ఈడ్చుకుంటూ.. మెట్లపైకి తోసేశారు.
అయితే ఈ దాడిని నిరసిస్తూ షేక్ హైదర్ సాహెబ్, మేడూరి తిరుపతయ్య కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంటి ఎదుట ఉన్న రహదారిపై ధర్నా చేపట్టారు. వీరికి పలువురి మద్దతు లభించింది.