హైదరాబాద్లో మావోయిస్టుల అరెస్ట్ కలకలం రేపింది. అర్బన్ నక్సలిజం దేశమంతా చర్చ జరుగుతున్న వేళ ..నగరంలో మావోయిస్టుల కార్యకలాపాలు సంచలనం రేపాయి. ఇప్పటి వరకు గ్రామీణ ప్పారంతాలపై దృష్టి సారించిన మావోయిస్టులు ఇప్పుడ..అర్బన్ నక్సలిజంపై దృష్టి సారించారు.
మౌలాలి ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు, నలుగురు మావోయిస్టులను అరెస్ట్ చేశారు. ఏఓబీ ప్రాంతం నుంచి పారిపోయి హైదరాబాద్ కు నలుగురు మావోలు చేరుకున్నారన్న సమాచారంతో, విశాఖ పోలీసులు గత రాత్రి మౌలాలీ ప్రాంతంలో దాడులు చేశారు. అరెస్టు అయిన వారిలో ముగ్గురు మహిళా మావోలతో సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులకు పట్టుబడిన వారిలో ఆత్మకూరు అనూష, ఆత్మకూరు అన్నపూర్ణ, భవాని, కొర్ర కామేశ్వరరావు వున్నారు. వీరిని రేపు కోర్టు ముందు హాజరు పరిచి, ఆపై విశాఖకు తరలిస్తామని ఓ అధికారి వెల్లడించారు. వీరంతా 2017 నుంచి మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని, గత సంవత్సరం వీరు అగ్రనేత రామకృష్ణతో కలిసి పని చేశారని పోలీసులు తెలిపారు.
మన్యం ప్రాంతంలో మావోయిస్టుల సంఖ్యను పెంచుతూ పార్టీ బలోపేతానికి కృషి చేశారని, యువతను మావోయిస్టుల వైపు మళ్లించారని చెప్పారు. అరెస్టయిన వారిలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉన్నారని అన్నారు. పోలీసులపై మావోలు దాడి చేసిన మూడు ఘటనల్లో వీరు ప్రత్యక్షంగా పాలు పంచుకున్నారని వెల్లడించారు. ఒకేసారి నలుగురు మావోయిస్టులను హైదరాబాద్లో అరెస్ట్ చేయడం సంచలనం రేపుతోంది