పార్టీ నేతలంతా వరుసగా వెళ్లిపోతున్నారు. టీడీపీ పన్నుతున్న ఆకర్ష్ వలలో చిక్కుకుంటున్నారు. చివరికి.. అధినేత సొంత జిల్లా నుంచి కూడా ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కుతున్నారు. ఇలాంటి కీలక తరుణంలో..
వైఎస్ఆర్ కాంగ్రెస్ ను కాపాడేందుకు జగన్ ఏం చేస్తున్నారు? ఏపీ రాజకీయ వర్గాల్లో ఈ విషయం ఇప్పుడో టాపిక్ అయి కూర్చుంది. వెళ్లే వాళ్లను ఆపలేక.. ఉన్నవాళ్లను కంట్రోల్ చేయలేక.. జగన్ అసహనానికి గురవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
చేతిలో అధికారం లేదు. టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ కు దీటుగా స్పందించేందుకు తను తప్ప.. మరో నాయకుడు లేడు. ఇప్పటికే వలస వెళ్లిన భూమా నాగిరెడ్డికి తోడు.. మైసూరారెడ్డి లాంటి తలపండిన రాజకీయ నాయకులు కూడా పక్కదారి చూస్తున్నారన్న వార్తలు కూడా జగన్ ను ఆలోచనలో పడేస్తున్నాయట.
అందుకే.. రీసెంట్ గా పార్టీ ఎమ్మెల్యేలతో జరిపిన సమావేశంలో కూడా.. జగన్ కాస్త అతిగా స్పందించారని సమాచారం. ఎమ్మెల్యేలతో మీరు తరచుగా టచ్ లో ఉండండి సార్ అని ఒకరు చేసిన విజ్ఞప్తికి.. నాకే అంతమాట చెబుతావా అన్నంత రేంజ్ లో జగన్ రియాక్ట్ అయినట్టు.. మీడియాలో వార్తలు వచ్చాయి. ఇదే సందర్భంలో.. జగన్ కు వాస్తవాలు వివరించేందుకు ఆయన కోటరీ అయిన విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వంటి నేతలు ప్రయత్నిస్తున్నారట.
ఇవన్నీ గమనించాక జగన్ కూడా కాస్త ఆలోచనలో పడ్డారని.. పార్టీని గాడిలో పెట్టేందుకు అవసరమైన చర్యలపై ఆలోచిస్తున్నారనీ తెలుస్తోంది. ఈ చర్యలపై.. త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉందని పార్టీ వర్గాలంటున్నాయి. మరి చంద్రబాబుకు దీటుగా.. జగన్ చేయబోయే వ్యూహాలేంటో చూడాలంటే.. అవేంటో బయటికి వచ్చే వరకూ ఆగాల్సిందే.