ప్రజాసమస్యలను తెలుసుకోడానికి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పపాదాయత్ర వందరోజులు పూర్తిచేసుకోన్నారు. కడప జిల్లా ఇడుపులపాయ వద్ద గతేడాది నవంబర్ 6న జగన్ ప్రారంభించిన ప్రజాసంకల్ప యాత్ర నేటితో వంద రోజులు పూర్తిచేసుకొంది. ఇది మాములు సెంచరీ కాదు. అటు వైఎస్ఆర్సీ పార్టీకి, ఇటు జగన్ రాజకీయ భవిష్యత్తుకు కొలమానం లాంటి సెంచరీ.
ప్రస్తుతం ప్రజాసంకల్పయాత్ర ప్రకాశం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. పాదయాత్రలో ప్రజా సమస్యలను సావధానంగా తెలుసుకుంటూ వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు జననేత. టీడీపీ ప్రభుత్వం సాగిస్తున్న ప్రజావ్యతిరేక పాలనను ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు. ఇక ప్రత్యేక హోదా అంశంపై తమ పార్టీ వైఖరిని ప్రజలకు వివరిస్తున్నారు.
పాదయాత్రలో ప్రత్యేకహోదాపై జగన్ వ్యూహాత్మకం నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలమధ్య వారిఅనుమతితోనే తీసుకుంటుండటం జగన్కు ప్లస్. మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ లో చేయబోయే ఆందోళనల నుంచి మూకుమ్మడి రాజీనామాల వరకు.. ప్రతి ఒక్క నిర్ణయాన్ని జనం మధ్య, జనాల సమ్మతంతో తీసుకున్నారు జగన్.
పాదయాత్రలో ఓవైపు చంద్రబాబు అవినీతి పాలనపై విమర్శలు గుప్పిస్తూనే, మరోవైపు తన పార్టీ జెండా, ఎజెండాను ప్రజలకు చేరవేస్తున్నారు. తను అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తానో స్పష్టంగా చెబుతున్నారు. రాష్ట్ర స్థాయిలో ఇచ్చే హామీలను వివరిస్తూనే… తన పర్యటనలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధి పనులపై కూడా జగన్ స్పందిస్తున్నారు. అన్ని వర్గాలను ఆకట్టుకుంటూ జగన్ ముందుకు సాగుతున్నారు.
