జగన్ కు అత్యంత సన్నిహితులు.. దగ్గరి వారు.. మంత్రి పదవులు ఖాయంగా వస్తాయని అనుకున్న వారికి నిరాశ ఎదురైంది. జగన్ కీలక నేతలను మంత్రివర్గంలోకి తీసుకోకుండా పక్కనపెట్టడం సంచలనంగా మారింది. మరీ ముఖ్యంగా గెలిస్తే మంత్రిని చేస్తానని హామీ ఇచ్చిన జగన్.. ఇప్పుడు విస్తరణలో మరిచిపోవడం చర్చనీయాంశంగా మారింది..
మంగళగిరి.. మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక బెట్టింగ్ కాసింది ఈ నియోజకవర్గంపైనే.. రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా ఎదురుచూసిన ఫలితం ఇదీ.. చంద్రబాబు తనయుడు తొలిసారి అసెంబ్లీ బరిలోకి దిగిన మంగళగిరిలో ఆయనను చిత్తుగా ఓడించాడు ఆళ్ల రామకృష్ణారెడ్డి. లోకేష్ ను ఓడిస్తే ఆళ్లను మంత్రిని చేస్తానని ప్రచారంలో జగన్ స్పష్టమైన హామీనిచ్చాడు. అలాగే జనాలు ఆళ్లను గెలిపించారు. కానీ తాజా మంత్రివర్గంలోకి రామకృష్ణారెడ్డిని తీసుకోలేదు.
ఇక మరో ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజాను కూడా జగన్ తీసుకోలేదు. హోంమంత్రి పదవి ఖాయమంటూ.. లేదా ఏదైనా మంత్రి పదవి రోజాకు దక్కుతుందని అంతా ఎదురుచూశారు. కానీ జగన్ ఇవ్వలేదు..
ఇక జగన్ కు అత్యంత నమ్మినబంటు.. సహాయకుడిగా ఉంటూ ప్రతిపక్షాలపై మాటల తూటాలు పేల్చే అంబటి రాంబబుకు కూడా మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం గమనార్హం.
ఇక మంత్రిపదవి ఖాయం అనుకున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కూడా ఆపదవిని ఇవ్వలేదు జగన్.. గిరిజన కోటాలో పోలవరం ఎమ్మెల్యే బాలరాజుకు అవకాశం ఇస్తారని అనుకున్నా.. పుష్ఫ శ్రీవానికి మంత్రి పదవి ఇచ్చాడు జగన్. ఇక రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులుకు మంత్రి పదవి ఖాయమని చెప్పి చివర్లో పేరు లేకపోవడం సంచలనంగా మారింది.
మొత్తం 40 మంది రెడ్డి సామాజికవర్గం ఎమ్మెల్యేలు గెలవగా.. జగన్ కేవలం నలుగురికే మంత్రి పదవులు ఇచ్చారు. రెడ్ల రాజ్యంలా ఉండద్దనే బలహీన వర్గాలకు పెద్ద పీట వేశారు. ఇలా జగన్ నిర్ణయం రెడ్డి ఎమ్మెల్యేలను అధికారానికి దూరం చేసింది.