ఇటీ వల జరిగిన ఎన్నికల్లో వైసీపీ 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ సీట్లు సాధించి అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఫ్యాన్ గాలికి సైకిల్ చిత్తు చిత్తు అయ్యింది. 151 అసెంబ్లీ సీట్లతో పాటు 22 ఎంపీ సీట్లు గెలుచుకుని రికార్డు సృష్టించిన జగన్ పార్టీ నుంచి చాలా మంది రికార్డులు బద్దలు కొట్టారు. పార్టీ నుంచి పోటీ చేసిన వారిలో 21మందికి పైగా 40 వేల ఓట్ల మెజార్టీ లభించింది. రాయలసీమలో మొత్తం 52 స్థానాలకు టీడీపీ కేవలం మూడు చోట్ల మాత్రమే నెగ్గింది.
సీమనుంచి ఎన్నికైన ఎంపీలందరూ లక్షకు పైనె మెజారిటీ సాధించారు. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి పోటీ చేసిన ఓ యంగ్ ఎంపీ దేశంలో అతి తక్కువ వయస్సులో ఎంపీగా గెలిచిన మహిళగా రికార్డులకు ఎక్కారు. రాజకీయంగా ఓనమాలు నేర్చుకునే వయసులోనే ఎన్నికల గోదాలో అరంగేట్రం చేసి ఉద్ధండుడిపై భారీ మెజార్టీతో విజయాన్ని సొంతం చేసుకుంది.
విశాఖ జిల్లా అరకు పార్లమెంటు స్థానం నుంచి విజయం సాధించిన గొడ్డేటి మాధవి లోక్సభ చరిత్రలోనె ఎన్నికైన అతిపిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. అమె వయస్సు ప్రస్తుతం 25 ఏళ్ల 3 నెలలు మాత్రమే. ఇంతకు ముందు ఈ రికార్డు 2014 ఎన్నికల్లో హర్యానా రాష్ట్రం హిసార్ లోక్సభ స్థానం నుంచి జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) తరపున గెలుపొందిన దుష్యంత్ చౌతాలా పేరున ఉండేది. ఈయన ఎంపీగా గెలిచే సమయానికి వయసు 26 ఏళ్ల 13 రోజులు. ఇప్పుడు గొట్టేటి మాదవి ఆరికార్డును బద్దలు కొట్టారు.
మాధవి ఇప్పుడు అరకు నుంచి పోటీ చేసి టీడీపీ తరపున పోటీ చేసిన రాజవంశీకుడు అయిన కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్పై 2 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు.ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ ఆరు నెలల క్రితం జగన్ ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా వైసీపీలో చేరి రాజకీయ అరంగేట్రం చేశారు. తమలోని ఒకరిగా భావించిన గిరిజనం ఆమెకు భారీ మెజార్టీతో పట్టం కట్టారు.