వైసీపీతరుపున గెలిచి ఫార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అధికార పార్టీ చుక్కలు చూపిస్తోంది. వారికి కనీస గౌరవం ఇవ్వకపోగా కూరలో కరివేపాకులా తీసేస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పరిస్థితి అంతా గడ్డుగా తయారైంది. టీడీపిలో చేరిన తర్వాత ఆమెను పట్టించుకునే వారు లేకుండా పోయారు. తాజాగా పరిణామం ఆ విషయాన్ని తెలియజేస్తోంది.
ఎమ్మెల్యేని చేసిన పార్టీకి డబ్బు, పదవుల కోసం ద్రోహం చేశావంటూ సొంత గిరిజనులే ఆడిపోసుకోవడం దరిమిలా ఏజెన్సీలో ఆమెను పట్టించుకునే వారు కరువయ్యారు. వాస్తవంగా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా స్థానిక ఎమ్మెల్యే అధ్యక్షత వహించడం, వారి ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టడం సంప్రదాయం. ప్రతిపక్ష పార్టీకి చెందినా కూడా ప్రొటోకాల్ నిబంధనల ప్రకారం ఆ ఎమ్మెల్యే అధ్యక్షతనే కార్యక్రమం జరగాలి.
అధికార తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి మాత్రం ఆమె నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమం విషయంలో ఆ గౌరవం దక్కడం లేదు. ప్రభుత్వం ప్రపంచ ఆదివాసీల దినోత్సవం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం విషయంలోఆమెను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా అధికారిక ఆహ్వాన పత్రికను అచ్చు వేశారు.
9వ తేదీ గురువారం పాడేరు జూనియర్ కళాశాల గ్రౌండ్స్లో జరిగే ఆదివాసీ దినోత్సవానికి సీఎం చంద్రబాబునాయుడు ముఖ్య అతిథిగా వస్తుండగా, జిల్లా ఇన్చార్జ్ మంత్రి, ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు. వాస్తవానికి ఆమె అధ్యక్షతన జరగాల్సిన కార్యక్రమ ఆహ్వాన పత్రికలో జిల్లా ఎమ్మెల్యేల జాబితాలో మాత్రమే ఆమెకు చోటు కల్పించడం చర్చనీయాంశమైంది.