ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకు కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ మద్య కాలంలో కరోనా కాటుకు పలువురు రాజకీయ నేతలు కన్నుమూస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఎపిలోని కర్నూలు జిల్లాలోని పత్తికొండ ఎంఎల్ఎ కే. శ్రీదేవి కరోనా బారినపడ్డారు. తనలో స్వల్ప అనారోగ్య లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నట్టు ఆమె స్వయంగా వెల్లడించారు. ఈ పరీక్షల్లో తనకు పాజిటివ్ నిర్థారణ అయిందని శ్రీదేవి తెలిపారు.
ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు ఆమె చెప్పారు. గత ఐదు రోజులుగా తనను కలిసినవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని కోరారు. తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైసిపి కార్యకర్తలు , అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే.. గడిచిన ఒక్కరోజులో ఎపిలో 22,164 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 12,87,603కి చేరింది. గడిచిన ఒక్కరోజులో కరోనాతో 93 మంది చనిపోయారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 8,707కు చేరింది. ఇప్పటివరకు 10,88,264 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఎపిలో 1,90,632 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
సినీ నటుడు జూ.ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్