ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మరో దళిత ఎంపీ యశ్వంత్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. మొన్ననే యూపీలోని రాబర్ట్స్గంజ్ ఎంపీ ఛోటే లాల్ ఖార్వార్ కూడా ప్రధాని మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో ఎంపీ కేంద్రంలోని బీజేపీని విమర్శిస్తూ.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశాడు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నాలుగేళ్లలో దళితులపై తీవ్ర నిర్లక్ష్యం చూపిందంటూ ఆరోపణలు చేశాడు. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే స్వయంగా బీజేపీ దళిత ఎంపీ ఆరోపణలతో బీజేపీ ఇరకాటంలో పడింది.
నాగిన నియోజవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న యశ్వంత్ కేవలం రిజర్వేషన్ కారణంగానే తాను ఎంపీనయ్యా అని ఆవేదనతో చెప్పారు. ‘‘ఒక దళితుడిగా నా సామర్థ్యాన్ని ఏమాత్రం ఉపయోగించుకోవడం లేదు. నేను కేవలం రిజర్వేషన్ కారణంగానే పార్లమెంటు సభ్యుడిని కాగలిగాను. దేశంలోని 30 కోట్ల మంది దళితులకు నాలుగేళ్లలో కేంద్ర ప్రభుత్వం చేసింది శూన్యం’’ అంటూ తన లేఖలో ధ్వజమెత్తారు. ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై ఇటీవల ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు వెనక్కి తీసుకోవాలని కోరారు.