కేంద్రప్రభుత్వం ఇటీవలే విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరణ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. అప్పటి నుంచి ఏపిలో కొత్త రగడ మొదలైంది. ఈ విషయంపై అధికార, ప్రతిపక్షాలు గుర్రున ఉన్నాయి. నిన్న ఏకంగా టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా కూడా చేశారు. విశాఖను ప్రైవేటీకరణ చేస్తున్నందుకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
ఇదిలా ఉంటే సీఎం జగన్కు మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు ట్వీట్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రధానికి లేఖ రాసినందుకు ట్విటర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు గంటా. ‘సొంత ఇనుప ఖనిజం గనిని కేటాయించడం, రుణాలను ఈక్విటీ లుగా మార్చడం ద్వారా స్టాక్ ఎక్స్చేంజి లో నమోదై నిధుల సేకరణకు అవకాశం ఉండడం లాంటివి పరిష్కార మార్గాలు. ఇందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదములు తెలియచేస్తున్నాను.
అయితే కేంద్రం ఇప్పటికే పాలసీ తీసుకున్నందున లేఖ తో పాటు ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్లి ప్రధానిని కలిసి వైజాగ్ స్టీల్ ఏర్పాటు ఉద్యమాన్ని సైతం వివరించి విశాఖ, తెలుగు ప్రజల మనోభావాలను వివరించి ప్రధానిని ఒప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అవసరమైతే అఖిలపక్షాన్ని కూడా తీసుకెళ్లి ఒత్తిడి తేవాలని కోరుతున్నాను’ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.
మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో నేతలపై ఒత్తిడి పెరుగుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దురదృష్టకరమని, నష్టాల్లో ఉందని అమ్మడం సరికాదని, కేంద్రం తీసుకున్న నిర్ణయం ఉపసంహరించుకోకుంటే రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామని విశాఖ ఎంపీ ఎంవివి సత్యన్నారాయణ పేర్కొన్నారు.
దానిమ్మ తో ఎన్నో ప్రయోజనాలు.. తెలిస్తే వదలరు!