వైసీపీ అధినేత జగన్పై మరో సారి ఆసక్తిని కలిగించే వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. జాతీయ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వూలో జగన్ మాట్లాడిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. బీజేపీకి మద్దతు గురించి జగన్ వ్యూహాత్మకంగా మాట్లాడినట్టు తనకు కనిపించిందన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదాను మోదీ ఇవ్వబోరన్న ఉద్దేశంలో జగన్ ఉన్నట్టుగా కనిపించలేదని అభిప్రాయపడ్డారు. 2019 ఎన్నికల్లోపు రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ప్రకటించి, ఆపై ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలసి బీజేపీ వెళ్లినట్లయితే, బీజేపీతో జగన్ రహస్య ఒప్పందం చేసుకున్నారన్న ఆరోపణలు నిజమైనట్టేనని భావించాల్సి వుంటుందని ఉండవల్లి పేర్కొన్నారు. జగన్, బీజేపీ కలిస్తే, ఏపీకి మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? అన్న విషయాన్ని కాలమే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీతో కలవలేని పరిస్థితిలో జగన్ ఉన్నాడని తెలిపిన ఆయన, ఆ పరిస్థితి కాంగ్రెస్ అధిష్ఠానం వైఖరి వల్లే వచ్చిందని వెల్లడించారు. విభజన హామీలు అమలు కావడం లేదని, అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తరువాత చంద్రబాబు ఇప్పుడు తెలిసొచ్చిందని ఎద్దేవ చేశారు.