ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ బేరసారాల అంశం పెను సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తాండూరు టిఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ అధిష్టానం వేసిన ప్లాన్ ను కేసిఆర్ పక్కా వ్యూహంతో అమలు చేసి బట్టబయలు చేశారు. దీంతో బీజేపీ చిక్కుల్లో పడ్డట్లు అయింది. గతంలో కూడా కేసిఆర్ రేవంత్ రెడ్డి ఓటు కు నోటు విషయంలో కూడా ప్లాన్ అమలు చేసి తెలంగాణలో టీడీపీ ఉనికే ప్రశ్నార్థకంగా మార్చారు. ఇక ఇప్పుడు బీజేపీ రూపంలో టిఆర్ఎస్ కు గట్టి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో మరోసారి తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టి బీజేపీకి గట్టి షాక్ ఇచ్చారనే చెప్పవచ్చు. .
గత కొన్నాళ్లుగా టిఆర్ఎస్ లో ఏక్ నాథ్ షిండే లను సృష్టిస్తామని కమలనాథులు బహిరంగంగానే చెబుతూ వచ్చారు. దీంతో అలెర్ట్ అయిన కేసిఆర్ తన ఎమ్మెల్యేలతో సుస్థిర సంబంధాలు కొనసాగిస్తూ.. ఎత్తుకు పై ఎత్తు వేసి బీజేపీ ప్రణాళికలను చిత్తు చేశారు. దీంతో బీజేపీ దూకుడుకి కళ్ళెం పడ్డాట్లైంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బీజేపీ దూతలు జరిపిన సంబాషణలు, అందుకు సంబంధించిన ఆడియో లీక్ లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
అయితే కేసిఆర్ ఈ ఫామ్ హౌస్ వ్యవహారాన్ని చాలా పకడ్భందిగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బీజేపీ పార్టీ ఫిరాయింపుకు పాల్పడేందుకు బేరసారాలు చేస్తోందనే సమాచారం రావడంతో మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ముందుగానే సిసి కెమెరాలు ఏర్పాటు చేసి.. టిఆర్ఎస్ ఎమ్మెల్యేల వద్ద సీక్రెట్ మైక్స్ కూడా ఉంచి పక్కా పథకం ప్రకారం బీజేపీ దూతలను ట్రాప్ చేశారు కేసిఆర్. దీంతో కేసిఆర్ వేసిన ఉచ్చులో బీజేపీ చిక్కుకొని ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఒక విధంగా ఈ వ్యవహారం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీపై గట్టిగా ప్రభావం చూపే అవకాశం ఉంది. మొత్తానికి కేసిఆర్ తన వ్యూహరచనకు ఎంతటి వారైనా చిత్తు కావాల్సిందే అని మరోసారి నిరూపించారు.
ఇవి కూడా చదవండి
కుప్పంలో అరాచకం ఎవరిది.. చంద్రబాబు దా ? జగన్ దా ?