ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండ రాం రెండేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరును పరిశీలించారు. ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ప్రజల అభీష్టానికి అనుగుణంగా లేదని భావించి తిరుగుబాటు ఎగురవేశారు. ఇక అప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారిన కోదండ రాం తరచూ సీఎం కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. అయితే ఆయన పోరాటం చేస్తున్నా అంతగా స్పందన ఉండకపోవడంతో ప్రత్యేక పార్టీ వైపు దృష్టి సారించి ఎట్టకేలకు ఇప్పుడు పార్టీని స్థాపించారు.
తెలంగాణ జన సమితి అనే పార్టీని ప్రకటించిన కోదండ రాం పార్టీ జెండాను కూడా బుధవారం (ఏప్రిల్ 4) హైదరాబాద్లో ప్రొఫెసర్ కోదండరాం విడుదల చేశారు. అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత జెండాకు ఒక రూపం ఇచ్చినట్లు తెలిపారు. జెండా ఎలా ఉందో తెలుసుకోండి.
జెండాలో సింహభాగం పాలపిట్ట రంగు ఉంది. పైన పాలపిట్ట రంగులో జెండా ఉండగా కింద భాగంలో ఆకుపచ్చ రంగులో జెండా రూపొందించారు. పైన ఉన్న పాలపిట్ట రంగులో ఉన్న భాగంలో నీలి రంగులో తెలంగాణ మ్యాప్ ఉంది. తెల్లరంగులో అమర వీరుల స్థూపం ఉంది. కింద భాగం ఆకుపచ్చ రంగు ఉన్న ప్రాంతంలో తెల్లరంగులో తెలంగాణ జన సమితి అనే పార్టీ పేరు రాసి ఉండి ఆకట్టుకునేలా రూపొందించారు. మూడు నమూనాల్లో దీన్ని కోదండరాం ఫైనల్ చేశారు.