వరుస ఫిరాయింపులతో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఒక వైపు ప్రజా సమస్యలు తెలుసుకునే ఉద్దేశంతో, పాదయాత్ర చేస్తూ ముందుకు సాగుతున్న వైఎస్ జగన్ కు తాజాగా చిత్తూరు జిల్లాలో పెద్ద షాక్ తగిలింది. చిత్తూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, కుప్పం ప్రాంతానికి వైకాపా నేత సుబ్రహ్మణ్యం రెడ్డి తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
వైకాపాలో అవమానాలు భరించలేకనే పార్టీని వీడుతున్నానని కార్యకర్తల ముందు కన్నీటితో చెప్పిన ఆయన, ఇదే విషయాన్ని జగన్ కు రెండు పేజీల లేఖలో వెల్లడించానని అన్నారు. వైఎస్ మరణం తర్వాత ఆయన కుమారుడి వెంట నడిచేందుకు తాను జెడ్పీ చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేసి వచ్చానన్నారు. కానీ జగన్ మాత్రం తనను నిర్లక్ష్యం చేశారన్నారు. తనపై నిందలు వేసి2019 వరకు కుప్పం నియోజకవర్గంలో అడుగు పెట్టవద్దని తనపై ఆంక్షలు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు.
ప్రాంతంలో పార్టీకి అండగా నిలిచిన తనపై నిందలు వేశారని, తనకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. ప్రస్తుతం సుబ్రహ్మణ్యం రెడ్డి రాజకీయంగా ఎటు పయనిస్తారన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు. ఆయన మాతృపార్టీ అయిన కాంగ్రెస్ లో చేరుతారని కొందరు విశ్లేషిస్తుంటే, బీజేపీ నుంచి కూడా ఆయనకు ఆహ్వానముందని మరికొందరు అంటున్నారు.