స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసు నుండి బాబును గట్టెక్కించేందుకు రంగంలోకి దిగారు సిద్ధార్థ్ లూథ్రా.చంద్రబాబు తరపున బలంగా వాదనలు వినిపిస్తుండగా ఏఐజీ సుధాకర్ సైతం ధీటుగా వాదిస్తుండటంతో మరిన్ని రోజులు చంద్రబాబు జైలులోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. సిద్ధార్థ్ లేవనెత్తిన ప్రతి అంశాన్ని చాకచక్యంగా తిప్పికొడుతోంది సుధాకర్ బృందం.
ఈ నేపథ్యంలో బాబు వేసిన క్వాష్ పిటిషన్,హౌస్ అరెస్ట్కు అనుమతివ్వాలన్న ప్రతి దానిని తిరస్కరించింది న్యాయస్థానం. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో ములాఖత్లో భేటీ అయ్యారు లూథ్రా. దాదాపు 40 నిమిషాల పాటు ఈ భేటీ జరుగగా కేసు గురించి కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఇక ఇప్పుడు లూథ్రా చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. అన్ని విధాలుగా ప్రయత్నించినప్పుడు ఇంకా న్యాయం కనుచూపు మేరలో లేదని తెలిసినప్పుడు కత్తి తీసి పోరాటం చేయడమే సరైందని గురు గోవింద్ సింగ్ పేర్కొన్న వ్యాఖ్యలను సిద్ధార్థ్ లూథ్రా తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. ఈ రోజు ఇదే మా నినాదమని ఆయన పేర్కొన్నారు. దీంతో చంద్రబాబు బెయిల్ గురించిన అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారని నెటిజన్లు కామెంట్ పోస్ట్ చేస్తున్నారు. చంద్రబాబు రిమాండ్ రాజ్యాంగ విరుద్ధమని, చంద్రబాబు అరెస్టుకు ముందు గవర్నర్ అనుమతి తీసుకోలేదని, రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని లూథ్రా వాదనలు వినిపించారు. అలాగే ఇలాంటి కేసుల్లో గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. అయితే ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం బాబుకు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.
