విజయవాడ మేయర్ పీఠాన్ని వైసిపినే కైవసం చేసుకుంటుందని మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కురసాల కన్నబాబు ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలో కొండవీడు అకాడమీ నుంచి ప్రియదర్శని కాలనీ, పాత హౌసింగ్ బొర్డు కాలనీల్లో మంత్రులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా టీ దుకాణం వద్ద కొద్దిసేపు ఆగిన మంత్రులు.. టీ స్టాల్ యజమానిని పలకరించి, మంత్రి స్వయంగా ఛాయ్ పెట్టి.. తాగి అందరినీ ఆశ్చర్యపరిచారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కులమతాలు, పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో వైసిపి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు.
టిడిపి నేతలు పగటి కలలు కంటున్నారని, పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను వైసిపి కైవసం అవుతాయని జోస్యం చెప్పారు. రాష్ట్ర ప్రజలు ఎన్ని సార్లు టీడీపీ నేతలకు బుద్ది చెప్పినా వారి వక్ర బుద్ది మాత్రం పోనివ్వడం లేదని.. వైసీపీని ఎంత టార్గెట్ చేస్తే అంత పై పైకి పోతుందని అన్నారు.