ఎట్టకేలకు మునుగోడు ఉపఎన్నిక ప్రచార హోరు చివరి దశకు చేరుకుంది. ఇక ఇప్పటికే ప్రచార హోరును తారస్థాయికి తీసుకెళ్లిన ప్రధాన పార్టీలు ఇప్పుడు క్లైమాక్స్ కు సిద్దమౌతున్నాయి. ఈ నెల 30న చుండూరు మున్సిపల్ పరిధిలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది టిఆర్ఎస్. ఆ వెంటనే 31న బిజెపి జాతీయ అధ్యక్షుడు జేసీ నడ్డాతో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది బీజేపీ. ఇలా ఇరు పార్టీలకు చెందిన అగ్రనేతల బహిరంగ సభలు వెంటవెంటనే జరుగుతుండడంతో మునుగోడు చుట్టూ రాజకీయ వేడి మరింత పెరుగుతోంది.
మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్, టిఆర్ఎస్, బీజేపీ పార్టీలు పోటీ పడుతున్నప్పటికి.. ప్రధాన పోటీ మాత్రం టిఆర్ఎస్,బీజేపీ మద్యనే ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు అధికార పార్టీగా పరువు నిలబెట్టుకునేందుకు మునుగోడు బైపోల్ లో గెలవడం టిఆర్ఎస్ కు చాలా కీలకం. మరోవైపు వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపలంటే ఈ బైపోల్ లో గెలవడం బీజేపీకి చాలా అవసరం.ఈ నేపథ్యంలో ఇరు పార్టీలు వేస్తున్న ప్రణాళికలు, వ్యూహాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బీజేపీతో 800 కోట్ల డీల్ కుదిరిందని టిఆర్ఎస్ ఆరోపిస్తుంటే.. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.
ఇక తాజాగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బీజేపీ చేసిన బేరసారాలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ విధంగా మునుగుడు చుట్టూ రాజకీయ వేడి తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నవేళ ఇటు కేసిఆర్, అటు జేసీ నడ్డా ఈ నెల 30,31 తేదీలలో నిర్వహించబోయే బహిరంగ సభలలో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరి గతంలో ఏ ఉపఎన్నికకు లేనంత హైప్.. మునుగోడు బైపోల్ లో చోటు చేసుకుందనే చెప్పాలి. మరి ఇంతటి కీలకమైన ఈ ఉపఎన్నికలో ఏ పార్టీ విజయ ఢంఖా మోగిస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి