గత కొంత కాలంగా పంజాబ్ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్.. కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. ఈ పంచాయితీ ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నది. అధిష్ఠానం ఎన్నో సార్లు సర్దిచెప్పినా వీరిద్దరి మధ్య గ్యాప్ తగ్గడం లేదు. నవజ్యోత్ సింగ్ పీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. అయితే ఆయనకు ఆ పదవి ఇస్తే.. పార్టీలో తన ఆధిపత్యం తగ్గుతుందని సీఎం అమరీందర్ సింగ్ భావిస్తున్నారట. దీంతో వీరిమధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది.
ఈ క్రమంలో కాంగ్రెస్ హైకమాండ్ ఓ నిర్ణయానికి వచ్చింది. సిద్దూకు పీసీసీ ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం ఒప్పుకున్నట్టు సమాచారం. ఇటీవల సిద్దూ ఢిల్లీ వెళ్లారు. ఆయన రాహుల్గాంధీ, ప్రియాంకా గాంధీని కలిసేందుకు ప్రయత్నించారు. అయితే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చేందుకు నిరాకరించగా.. ప్రియాంకాగాంధీ సిద్దూకు అపాయింట్మెంట్ ఇచ్చారు.
పంజాబ్ రాజకీయ పరిస్థితులపై సిద్దూ .. ఆమెకు వివరించారట. అయితే సిద్దూకు పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ ఒప్పుకున్నట్టు సమాచారం. త్వరలోనే ఆయన రాహుల్గాంధీని కూడా కలవబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. సిద్దూకు పీసీసీ ఇవ్వడం.. సీఎం అమరీందర్కు ససేమిరా ఇష్టం లేదు. ఈ క్రమంలో ఆయనను బుజ్జగించేందుకు హై కమాండ్ చర్చలు జరపనున్నట్టు టాక్. ఇటీవల దూకుడుగా ఉండే నేతలకే కాంగ్రెస్ హైకమాండ్ కీలక పదవులు కట్టబెడుతున్నది. అందులో భాగంగానే సిద్దూకు పీసీసీ దక్కినట్టు సమాచారం.